TESLA: టెస్లాపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

TESLA: టెస్లాపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
X
టెస్లా దేశంలో తయారీకి సుముఖంగా లేదని కేంద్ర మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి స్పష్టం

భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. విద్యుత్తు వాహనాల దిగ్గజం టెస్లా దేశంలో తయారీకి సుముఖంగా లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి స్పష్టంచేశారు. ‘‘టెస్లా సంస్థకు భారత్‌లో షోరూమ్‌లు ప్రారంభించడంపై మాత్రమే ఆసక్తి ఉంది. కానీ, తయారీ స్థాపన దిశగా వారు ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు వేయలేదు,’’ అని ఆయన వెల్లడించారు. విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ, టెస్లా ప్రస్తుతం కేవలం మొదటి రౌండ్‌ చర్చల్లో మాత్రమే పాల్గొని, తర్వాతి రౌండ్లకు హాజరు కాలేదని తెలిపారు.

గతేడాది ఏప్రిల్‌లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారత్‌ పర్యటనకు రావాల్సి ఉండగా, కంపెనీ పనులతో అది వాయిదా పడింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాట్లాడుతూ, ‘‘ప్రపంచంలోని చాలా దేశాలు అమెరికా సాంకేతికతను వాడుకుంటూ, అధిక సుంకాలు విధిస్తూ తమ ప్రయోజనాలు పొందుతున్నాయి. భారత్‌ కూడా అలాంటి దేశమే. ఎలాన్ మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నా, అది అమెరికాకు నష్టదాయకమే,’’ అని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు భారత ప్రధాని మోదీతో కలిసిన సందర్భాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు.

Tags

Next Story