Kerala High Court: దంపతుల మధ్య వివాదం, బిడ్డకు నామకరణం చేసిన హైకోర్టు

Kerala High Court:  దంపతుల మధ్య వివాదం, బిడ్డకు  నామకరణం చేసిన హైకోర్టు
ఇరువురి పేర్లు కలిసేలా పేరు పెట్టిన కోర్టు

పుట్టిన తమ పిల్లలకు అందమైన, అర్థవంతమైన, ప్రత్యేకమైన పేరు పెట్టాలని తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నిస్తారు. అయితే ఆ పాప విషయంలో ఒక వింతైన పరిస్థితి తలెత్తింది. వేర్వేరుగా జీవిస్తున్న దంపతులు తమ మూడేళ్ల కుమార్తెకు పేరును నిర్ణయించడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చివరకు విషయం హైకోర్టుకు చేరింది.

కేరళకు చెందిన దంపతులకు మూడేళ్ల కిందట ఓ పాప పుట్టింది. అప్పటికే వారి మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. 2020 ఫిబ్రవరి 12న జన్మించిన ఆ చిన్నారి తన తల్లి వద్దనే ఉంటున్నది. ఆమె జనన ధ్రువీకరణ పత్రంలో పేరు లేకపోవడంతో ఆమె తల్లి జనన, మరణాల రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పేరును నమోదు చేయించేందుకు ప్రయత్నించారు. పేరు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే తల్లిదండ్రులిద్దరూ తన సమక్షంలో హాజరుకావాల్సిందేనని ఆ రిజిస్ట్రార్‌ చెప్పారు. పాప పేరును భార్య ‘పుణ్య నాయర్’ అనే పేరు సూచిస్తే.. భర్త ‘పద్మ నాయర్’అనే పేరు పెట్టాలని పట్టుబట్టాడు. ఇరువురూ ఈ విషయంలో పట్టువీడకపోవడంతో పాప తల్లి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌ బెచు కురియన్‌ థామస్‌ కోర్టు అధికార పరిధిని వినియోగించుకొని ఈ సమస్యను పరిష్కరించారు. తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరునూ జత చేసి, పాపకు ఓ పేరు ఖరారు చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.

తల్లిదండ్రుల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి సమయం పడుతుందని, ఈలోగా పేరు లేకపోవడం పిల్లల ప్రయోజనాలకు అనుకూలంగా ఉండదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘కోర్టు అధికార పరిధిని అమలు చేయడంలో తల్లిదండ్రుల హక్కులు కాకుండా పిల్లల సంక్షేమమే ప్రధానమైంది.. పిల్లల కోసం పేరును ఎంపిక చేసే పనిని కోర్టు నిర్వహించాలి. పేరు విషయంలో పిల్లల సంక్షేమం, సాంస్కృతిక పరిగణనలు, తల్లిదండ్రుల ఆసక్తులు, సామాజిక నిబంధనలు వంటి అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవచ్చు.. పిల్లల శ్రేయస్సు అందరి అంతిమ లక్ష్యం. అందుకే ఈ విషయంలో కోర్టు తన అధికార పరిధిని ఉపయోగించవలసి వచ్చింది’ అని వ్యాఖ్యలు చేశారు. పాపకు తల్లిదండ్రులు పేర్లు కలిసొచ్చేలా ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ అనే పేరు పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story