Corona Virus: మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు..

దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరిగాయి. రోజు రోజు కోవిడ్ కేసులు పెరగడంతో ప్రజల్లో భయాందోళన మొదలవుతోంది. నిన్నామొన్నటిదాకా వందల్లో ఉన్న కేసులు.. ఇప్పుడు వేలల్లోకి చేరుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,758 కేసులు ఉన్నట్లుగా వైద్యశాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు 22 మంది చనిపోయారు.
ఇక కేరళలో ప్రస్తుతం 1,400, ఢిల్లీలో 436, మహారాష్ట్రలో 814 కోవిడ్ కేసులు ఉన్నట్లుగా వైద్యశాఖ చెబుతోంది. గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో కూడా గణనీయమైన యాక్టివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇక ఒడిశాలో 12 కేసులు నమోదయ్యాయి. రోగులందరూ తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్నారని.. ఇంట్లోనే ఒంటరిగా చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. పెద్ద ముప్పులేదని.. భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. ఇక పశ్చిమ బెంగాల్లో 287 కేసులు నమోదయ్యాయి.
ఇక కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం అయింది. జూన్లో స్కూళ్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ.. ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మే 26న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్వహించిన కోవిడ్-19 సమీక్షా సమావేశం తర్వాత ఈ సూచనలు వచ్చాయి.
సూచనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: పాఠశాల పిల్లలకు జ్వరం, దగ్గు, జలుబు మరియు ఇతర లక్షణాలు కనిపిస్తే వారిని పాఠశాలకు పంపవద్దు. డాక్టర్ సూచించిన విధంగా తగిన చికిత్స మరియు సంరక్షణ చర్యలను తీసుకోవాలని సూచించింది. లక్షణాలు పూర్తిగా తగ్గిన తర్వాతే పిల్లలను పాఠశాలకు పంపాలని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com