New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు..

New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు..
X
ఇకపై ఆ నేరాలకు పాల్పడితే మీ పని అయిపోయినట్టే

బ్రిటిష్​ వలస పాలన కాలంనాటి చట్టాలకు ముగింపు పలుకుతూ న్యాయ వ్యవస్థలో కీలక మార్పులను తీసుకువస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం సోమవారం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులతో జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా సమన్లు జారీ చేయడం, క్రూరమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరి వీడియోగ్రఫీ వంటి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వటమే కాకుండా రాజద్రోహం పదాన్ని తొలగించారు. భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమాజంలో నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడానికి ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వలసవాద నేర న్యాయ చట్టాల ముగింపును సూచిస్తూ, అందరికీ న్యాయం చేయాలన్న తలంపుతో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. చట్టాలు కేవలం పేరు మార్పుకే పరిమితం కాదని, చట్టాల్లో పూర్తి సవరణలను తీసుకొచ్చామన్నారు. ఈ నూతన చట్టాలను పూర్తిగా భారతీయులే రూపొందించారని, దీని ఆత్మ, శరీరం పూర్తిగా భారతీయమేనని అన్నారు. ఈ కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని నిర్ధరిస్తాయని హోం మంత్రి తెలిపారు.

ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తైన 45 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుంచి 60 రోజులలోపు అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. అత్యాచార బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లో రావాలి. పిల్లలను కొనడం, విక్రయించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. భారతీయ శిక్షాస్మృతిలోని 511 సెక్షన్ల స్థానంలో ఇప్పుడు 358 సెక్షన్లు మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 18 సెక్షన్లు ఇప్పటికే రద్దు చేశారు.

Tags

Next Story