Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు రికార్డ్ స్థాయిలో భక్తులు

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు రికార్డ్ స్థాయిలో భక్తులు
X
10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ సర్కార్ వెల్లడి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 10 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ 10.21 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్‌ వెల్లడించింది. ఇక అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య అయిన జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.

సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవ‌రి 26వ తేదీన మ‌హాశివ‌రాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి త‌గిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. సుమారు ల‌క్షా 60 వేల టెంట్లను ఏర్పాటు చేశారు. ల‌క్షా 50 వేల టెయిలెట్లను నిర్మించారు. దాదాపు 15వేల మంది శానిటేస‌న్ వ‌ర్కర్లు పనిచేయ‌నున్నారు. 1250 కిలోమీట‌ర్ల దూరం పైప్‌లైన్ వేశారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, రెండు వేల సోలార్ లైట్లు, మూడు ల‌క్షల వృక్షాల‌ను ఏర్పాటు చేశారు.

Tags

Next Story