UP: జవాన్ను స్తంభానికి కట్టేసి చావబాదిన టోల్ సిబ్బంది

దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే ఓ సైనికుడికి ఘోర అవమానం ఎదురైంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో టోల్ బూత్ సిబ్బంది ఆర్మీ జవాన్పై పాశవికంగా దాడి చేశారు. అతడిని ఒక స్తంభానికి అదిమిపట్టి కర్రలతో చితకబాదారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సైన్యంలోని రాజ్పుత్ రెజిమెంట్లో పనిచేస్తున్న కపిల్ కవడ్ అనే సైనికుడు సెలవుపై తన స్వగ్రామానికి వచ్చారు. సెలవులు ముగియడంతో శ్రీనగర్లోని తన పోస్టింగ్కు తిరిగి వెళ్లేందుకు తన కజిన్తో కలిసి కారులో ఢిల్లీ విమానాశ్రయానికి బయలుదేరారు. మార్గమధ్యంలో మీరట్లోని భూనీ టోల్ బూత్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వారి కారు నిలిచిపోయింది.
విమానానికి సమయం మించిపోతుందనే ఆందోళనతో కపిల్ కారు దిగి టోల్ బూత్ సిబ్బందితో మాట్లాడారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన ఐదుగురు టోల్ సిబ్బంది ఒక్కసారిగా కపిల్, అతని కజిన్పై దాడికి దిగారు. కపిల్ను ఒక స్తంభానికి అదిమిపట్టి, చేతులు వెనక్కి లాగి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. స్థానిక గ్రామానికి చెందిన వారికి టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉందని కపిల్ చెప్పడంతోనే ఈ వివాదం మొదలైనట్లు కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్, వైరల్ వీడియోల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై రూరల్ ఎస్పీ రాకేశ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. "ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశాం. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. మిగిలిన వారిని పట్టుకోవడానికి రెండు బృందాలు గాలిస్తున్నాయి" అని తెలిపారు. విధులకు తిరిగి వెళ్తున్న ఒక సైనికుడిపై జరిగిన ఈ దాడి తీవ్ర సంచలనం సృష్టించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com