Gujarat: పట్టాలపై ఇనుప స్తంభాలు.. అప్రమత్తతో తప్పిన ప్రమాదం

అహ్మదాబాద్-పురీ రైలుతో పాటు మరో ట్రైన్కు పెను ప్రమాదం తప్పింది. రైళ్లను పట్టాలు తప్పించడానికి గుర్తుతెలియని వ్యక్తులు కుట్ర పన్నడం కలకలం రేపింది. పట్టాలకు అడ్డంగా ఇనుప స్తంభాలను ఉంచారు. అయితే లోకో పైలట్ల అప్రమత్తతో రెండు రైళ్లకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకునన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పూర్తి వివరాల్లోకి వెళితే వడోదరలోని వర్ణ-ఇటోలా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఆ మార్గంలో వెళ్లే రైలును పట్టాలు తప్పించడానికి దుండగులు కుట్ర పన్నారు. అందులో భాగంగా పట్టాలపై ఇనుప ఫెన్సింగ్ స్తంభాన్ని ఉంచారు. ఆదివారం రాత్రి అదే మార్గంలో వస్తున్న ఓఖా-షాలీమార్ రైలు ఆ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ రైలుకు ఏం కాలేదు. అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న అహ్మదాబాద్-పురీ రైలు లోకో పైలట్ ఆ స్తంభాలను గమనించి.. రైలును నిలిపివేశాడు. అనంతరం ఇటోలా రైల్వే స్టేషన్ మాస్టర్కు సమచారం అందించాడు. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ కంట్రోల్కు విషయం చేరవేశాడు. రైల్వే శాఖ వెంటనే అధికారులను, పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లోకో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే గత జూన్ 2న ఒడిశా.. బాలేశ్వర్లో షాలిమార్- చెన్నై కోరమాండల్ రైలు.. ఆగి ఉన్న గూడ్స్ను ఢీకొట్టిన విషయం ఇప్పటికీ ఎవరూ మరచిపోలేదు. గూడ్స్ను అతివేగంగా ఢీకొట్టిన తర్వాత కోరమాండల్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ బోగీలను అటునుంచి వస్తున్న బెంగళూరు- హవ్డా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టగా ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టింది.
ఈ కేసు విచారణలో భాగంగా గత నెలలో బాలేశ్వర్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్), సెక్షన్ ఇంజనీర్ మహ్మద్, టెక్నీషియన్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. హత్య, ఆధారాల ధ్వంసానికి సంబంధించిన పలు సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసింది. వీరంతా బాలేశ్వర్ జిల్లాలో విధులు నిర్వర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com