Gujarat: పట్టాలపై ఇనుప స్తంభాలు.. అప్రమత్తతో తప్పిన ప్రమాదం

Gujarat: పట్టాలపై  ఇనుప స్తంభాలు.. అప్రమత్తతో తప్పిన ప్రమాదం
స్తంభాలను గుర్తించి రైలును ఆపేసిన లోకో పైలట్

అహ్మదాబాద్​-పురీ రైలుతో పాటు మరో ట్రైన్​కు పెను ప్రమాదం తప్పింది. రైళ్లను పట్టాలు తప్పించడానికి గుర్తుతెలియని వ్యక్తులు కుట్ర పన్నడం కలకలం రేపింది. పట్టాలకు అడ్డంగా ఇనుప స్తంభాలను ఉంచారు. అయితే లోకో పైలట్​ల అప్రమత్తతో రెండు రైళ్లకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకునన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళితే వడోదరలోని వర్ణ-ఇటోలా రైల్వే స్టేషన్​ల మధ్య ఈ ఘటన జరిగింది. ఆ మార్గంలో వెళ్లే రైలును పట్టాలు తప్పించడానికి దుండగులు కుట్ర పన్నారు. అందులో భాగంగా పట్టాలపై ఇనుప ఫెన్సింగ్​ స్తంభాన్ని ఉంచారు. ఆదివారం రాత్రి అదే మార్గంలో వస్తున్న ఓఖా-షాలీమార్​ రైలు ఆ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ రైలుకు ఏం కాలేదు. అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న అహ్మదాబాద్​-పురీ రైలు లోకో పైలట్​ ఆ స్తంభాలను గమనించి.. రైలును నిలిపివేశాడు. అనంతరం ఇటోలా రైల్వే స్టేషన్ మాస్టర్​కు సమచారం అందించాడు. ఆ తర్వాత స్టేషన్​ మాస్టర్​ కంట్రోల్​కు విషయం చేరవేశాడు. రైల్వే శాఖ వెంటనే అధికారులను, పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


లోకో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే గత జూన్​ 2న ఒడిశా.. బాలేశ్వర్​లో షాలిమార్- చెన్నై కోరమాండల్ రైలు.. ఆగి ఉన్న గూడ్స్​ను ఢీకొట్టిన విషయం ఇప్పటికీ ఎవరూ మరచిపోలేదు. గూడ్స్​ను అతివేగంగా ఢీకొట్టిన తర్వాత కోరమాండల్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ బోగీలను అటునుంచి వస్తున్న బెంగళూరు- హవ్​డా సూపర్​ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ ఢీకొట్టగా ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టింది.

ఈ కేసు విచారణలో భాగంగా గత నెలలో బాలేశ్వర్​ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్), సెక్షన్ ఇంజనీర్ మహ్మద్, టెక్నీషియన్ లను సీబీఐ అరెస్ట్​ చేసింది. హత్య, ఆధారాల ధ్వంసానికి సంబంధించిన పలు సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసింది. వీరంతా బాలేశ్వర్​ జిల్లాలో విధులు నిర్వర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story