Vice President Elections : విపక్షాలకు టీఎంసీ షాక్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనబోమన్న మమతా బెనర్జీ
Vice President Election : కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలకు షాక్ ఇచ్చారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తమ పార్టీ సభ్యులు దూరంగా ఉంటారని ప్రకటించారు. ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించడంలో విపక్షాల వైఖరే ఇందుకు కారణమని స్పష్టం చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. అదే సమయంలో టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణించిన తీరు అభ్యంతరకరమన్నారు. విపక్షాల అభ్యర్థికి సైతం మద్దతివ్వమన్నారు. అందుకే ఓటింగ్కు దూరంగా ఉన్నట్లు చెప్పారు.
ఐతే టీఎంసీ తీరుపై స్పందించారు కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ గవర్నర్గా మమతా బెనర్జీతో అనేక విషయాల్లో విబేధించారన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వాతో కలిసి జగదీప్ ధన్ఖడ్ డార్జిలింగ్లో మమతా బెనర్జీతో సమావేశమయ్యారని చెప్పారు. సమావేశం జరిగిన మరుసటి రోజే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖడ్ పేరును ఎన్డీఏ ప్రతిపాదించిందన్నారు.
టీఎంసీ-బీజేపీ మధ్య డార్జిలింగ్ ఒప్పందం జరిగిందన్నారు అధిర్ రంజన్. ప్రతిపక్షాల ఐక్యతను ప్రోత్సహించాల్సిన బాధ్యత కాంగ్రెస్పైనే ఉందన్నారు అధిర్ రంజన్. ప్రతిపక్ష కూటమికి మమత నాయకత్వం వహించాలనుకున్నారని..కానీ ఆమె ఆ బాధ్యతల నుంచి పారిపోయారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ పారిపోలేదన్నారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్న జగదీప్ దన్ఖడ్ పేరును ప్రతిపాదించగా..విపక్షాలు కేంద్ర మాజీ మంత్రి మార్గరేట్ అళ్వా పేరును ప్రతిపాదించాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగష్టు 6న జరగనుంది. ఆగష్టు 10న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగుస్తుంది. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్ సభ్యులకు సైతం ఓటు హక్కు ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com