Trisha vs Nayinar Nagendran: త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత నాగేంద్రన్

రాజకీయ విమర్శల్లో వ్యక్తిగత దూషణలు ఏ స్థాయికి చేరుతాయో చెప్పడానికి ఇటీవల తమిళనాడులో చోటుచేసుకున్న పరిణామాలే నిదర్శనం. నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు బీజేపీ నేత నాయనార్ నాగేంద్రన్ చివరకు తలవొంచి క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.
ఈ వివాదం టీవీకే (TVK) పార్టీ అధినేత, నటుడు విజయ్పై నాగేంద్రన్ చేసిన విమర్శల్లో ఉన్నాయి. విజయ్కు రాజకీయ అనుభవం లేదని విమర్శించే క్రమంలో నాగేంద్రన్ శృతి మించి మాట్లాడారు. విజయ్ తన ఇంటిని వదిలి బయటకు రావాలని, ముఖ్యంగా నటి త్రిషతో ఉన్న రిలేషన్ నుంచి బయటపడితేనే ఆయనకు గ్రౌండ్ లెవల్ సమస్యలు అర్థమవుతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే ముందు తన వ్యక్తిగత బంధాలను సరిదిద్దుకోవాలంటూ ఆయన చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి.
రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తనను ఈ వివాదాల్లోకి లాగడంపై నటి త్రిష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగేంద్రన్ వ్యాఖ్యలు అత్యంత అసహ్యంగా ఉన్నాయని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె మండిపడ్డారు. రాజకీయాల కోసం ఒక మహిళ గౌరవాన్ని కించపరచడం సరికాదని, ఇలాంటి ఆరోపణలు మళ్ళీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనని త్రిష ఘాటుగా హెచ్చరించారు. ఈ హెచ్చరికతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ మద్దతు లభించింది.
కేవలం సినీ వర్గాలే కాకుండా రాజకీయ పక్షాలు కూడా నాగేంద్రన్ తీరును ఖండించాయి. డీఎంకే నేత, ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. వ్యక్తిగత జీవితాలను ప్రజాక్షేత్రంలో విమర్శించడం అనాగరికమని పేర్కొన్నారు. అసలు రాజకీయాలకు సంబంధం లేని మహిళల గురించి ఇలా మాట్లాడటం బీజేపీ సంస్కృతికి నిదర్శనమని ఆమె ఎద్దేవా చేశారు. చుట్టుముట్టిన విమర్శలు, త్రిష హెచ్చరికలతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన నాయనార్ నాగేంద్రన్, చివరకు విచారం వ్యక్తం చేస్తూ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
