Sergio Gore: భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌లో కీలక వ్యక్తి

Sergio Gore: భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌లో కీలక వ్యక్తి
X
సంక్లిష్ట పరిస్థితుల్లో రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్

భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం ఇరుదేశాలకు సంబంధించి ప్రధాన దౌత్య విజయంగా పేర్కొంటున్నారు. వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత్‌లో అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జనవరిలోనే రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య బంధాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి వివిధ అంశాల కారణంగా ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించారు. ఇలాంటి సంక్లిష్ట వాతావరణంలో భారత్‍‌లో రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో వాణిజ్య ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా, భారత్ మధ్య బలమైన స్నేహం వల్లే ఈ ఒప్పందానికి అంగీకారం లభించిందని, ఇప్పటి నుంచి రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సెర్గియో అన్నారు.

సెర్గియో గోర్ కుటుంబం అమెరికాకు 1990లలో వలస వచ్చింది. ఆయన తల్లిదండ్రులవి రష్యా మూలాలు. అమెరికా వచ్చిన కొంతకాలానికే గోర్‌కు పౌరసత్వం లభించింది. 2008లో పొలిటికల్ సైన్స్, అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. మొదటి నుంచి ఆయన రిపబ్లికన్ పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2020లో ట్రంప్ హయాంలో విక్టరీ ఫైనాన్స్ కమిటీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులయ్యారు.

నాటి నుంచి ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. భారత్‌కు రాయబారిగా కంటే ముందు, శ్వేతసౌధంలో పర్సనల్ డైరెక్టర్‌గా పని చేశారు. ట్రంప్ రాజకీయ అజెండాకు తగినట్లు నిర్ణయాలు అమలు చేస్తారు. వాణిజ్య ఒప్పందానికి కొన్ని రోజుల ముందు గోర్ మాట్లాడుతూ, ట్రంప్, మోదీల మధ్య నిజమైన స్నేహబంధం ఉందని, అమెరికాకు భారత్ తర్వాతే ఎవరైనా అని పేర్కొన్నారు.

Tags

Next Story