Nepal Student: ఒడిశాకు నేపాలీ ఎంబసీ అధికారులు

ఒడిశాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న నేపాలీ విద్యార్థిని పాకృతి లామ్సల్ ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. వర్సిటీ హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన క్యాంపస్ లో ఉద్రిక్తతకు దారితీసింది. వర్సిటీలో చదువుతున్న నేపాలీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను క్యాంపస్ వదిలి వెళ్లిపోవాలని వర్సిటీ అధికారులు ఆదేశించారని, ఉన్నపళంగా వెళ్లిపోమంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆందోళనతోనే తమ తోటి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఒడిశాలోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ) లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పాకృతి లామ్సల్ ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని అన్నారు. దీనిపై భారత్ లోని నేపాల్ ఎంబసీ అధికారులు ఇద్దరిని వర్సిటీకి పంపించామని చెప్పారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, వర్సిటీలో ఉండలేమని అనుకుంటే తిరిగి వచ్చేయాలని సూచించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. చదువు పూర్తయ్యేంత వరకూ ఉండిపోతామంటే భారత ప్రభుత్వంతో మాట్లాడతామని.. విద్యార్థుల అభీష్టం మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఓలి తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ అమ్మాయి కజిన్ సోదరుడు భువనేశ్వర్లోని ఇన్ఫోసిటీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. హాస్టల్ రూమ్లో తన సోదరి ఆత్మహత్య చేసుకున్నట్లు అతను ఫిర్యాదు నమోదు చేశాడు. ఓ స్టూడెంట్ తన సోదర్ని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించాడు. దాని వల్లే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు చెప్పాడు. కళింగ కాలేజీలో చదువుతున్న మరో విద్యార్థితో ఆ అమ్మాయికి అఫైర్ ఉందని, మరో కారణం చేత ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కాలేజీ యాజమాన్యం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com