JK Encounter: జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. బందిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్లో గురువారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు వారు చేసిన కుట్రను సైనికులు భగ్నం చేశారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గురెజ్ సెక్టార్లోని నౌషెహ్రా నార్డ్ ప్రాంతంలో కొందరు ఉగ్రవాదుల కదలికలను సైన్యం గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన సైనికులు వారిని లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అయితే, ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మరణించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగి ఉన్నారా అనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇటీవలి కాలంలో కశ్మీర్ లోయలో చొరబాటు యత్నాలు పెరిగాయి. ఆగస్టు 25న బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో కూడా ఇలాంటి చొరబాటు ప్రయత్నాన్ని జాయింట్ ఫోర్సెస్ విఫలం చేశాయి. అంతకుముందు ఆగస్టు 13న ఉరీ సెక్టార్లోనే జరిగిన ఓ ఎన్కౌంటర్లో ఒక సైనికుడు వీరమరణం పొందారు.
కేవలం ఉగ్రవాదులను ఏరివేయడమే కాకుండా ఉగ్రవాదానికి సహకరిస్తున్న పూర్తి వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు దూకుడుగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓవర్గ్రౌండ్ వర్కర్లు (ఓజీడబ్ల్యూలు), సానుభూతిపరులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం భద్రతా సమీక్ష సమావేశాల్లో ఇదే అంశంపై దృష్టి సారిస్తున్నారు. హవాలా డబ్బు, డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందుతున్నాయని గుర్తించిన ఏజెన్సీలు.. ఆ మార్గాలను మూసివేయడంపై ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ఈ రాకెట్లను ఛేదించడం ద్వారా ఉగ్రవాదానికి ఆర్థిక మూలాలను దెబ్బతీయవచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com