Waqf Board: వక్ఫ్ బిల్లు సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

వక్ఫ్ బిల్లు పరిశీలనకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సూచించిన సవరణలకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, చర్చించేందుకు మార్గం సుగమమైంది. జగదాంబిక పాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జేపీసీ కమిటీ కేంద్ర వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం, వివాదాలకు సంబంధించిన విచారణలను జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఉద్యోగికి అప్పగించడం, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిం ఓబీసీ వర్గం నుంచి ఓ వ్యక్తిని నియమించి, ఆయన అధికారాలను విస్తృతం చేయడం వంటి సవరణలను సూచించింది.
వక్ఫ్(సవరణ) బిల్లుపై ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తన నివేదికను ఈనెల 13న పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. లోక్సభలో జేపీసీకి చైర్మన్గా వ్యవహరించిన జగదాంబికా పాల్, రాజ్యసభలో జేపీసీ సభ్యురాలు మేధా విశ్రమ్ కుల్కర్ణి నివేదికను ప్రవేశపెట్టారు. అయితే, జేపీసీలో భాగంగా ఉన్న ప్రతిపక్ష సభ్యులు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలను ఈ నివేదిక నుంచి తొలగించారని విపక్ష సభ్యులు ఆరోపించారు.
నివేదికను లోక్సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. అయితే, భిన్నాభిప్రాయాలను నివేదికలో చేర్చడానికి తమకేమీ అభ్యంతరం లేదని లోక్సభ స్పీకర్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జేపీసీ నివేదికను ఉపసంహరించుకోవాలని రాజ్యసభలో విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ఇది ఫేక్ నివేదిక అని, మెజారిటీ సభ్యుల ఆలోచనలనే నివేదికలో పొందుపర్చడం అప్రజాస్వామికమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాగా, నివేదికలోని కొన్ని భాగాలకు తొలగించే అధికారం కమిటీ చైర్మన్కు ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఇక విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసనల మధ్యే ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.
ఈ నేపథ్యంలోనే గత వారం ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. మార్చి 10న ప్రారంభం కానున్న రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు మార్గం సుగసుగమమైంది.
కాగా, జనవరి 29న ముసాయిదా నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆమోదించిన విషయం తెలిసిందే. 15-11 మెజారిటీ ఓటుతో ముసాయిదా చట్టానికి సబంధించిన నివేదికను ఆమోదించింది. బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించింది. అయితే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్, శివసేన(యూబీటీ), ఏఐఎంఐఎంతోసహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది. కమిటీ ఆమోదించిన సవరణల ప్రకారం రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉంటారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వాలు అఘాఖానీ, బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసే నిబంధనలు కూడా సవరణలలో ఉన్నాయి. వక్ఫ్ అలాల్ ఔలాద్ (కుటుంబ వక్ఫ్లు)లో మహిళల వారసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించే నిబంధనలు ఉన్నాయి.
అయితే, ఈ నివేదికపై ప్రతిపక్ష సభ్యులు తమ డిస్సెంట్(అసమ్మతి) నోట్ను సమర్పించారు. గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఆధునికతను, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకురావడమని బీజేపీ సభ్యులు వాదించగా, ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా, వక్ఫ్ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com