BJP: బీహార్లో అఖండ విజయం దిశగా ఎన్డీయే..తమ నెక్ట్స్ టార్గెట్ బెంగాల్ అంటున్న కేంద్రమంత్రి..

దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేపిన బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈక్రమంలోనే అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. దాదాపు 174 స్థానాల్లో ఈ కూటమి ముందంజలో ఉండటంతో.. బీహార్లో మరోసారి అధికారం దక్కించుకోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విజయోత్సాహంతోనే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్లో గెలిచాం.. తర్వాత టార్గెట్ పశ్చిమ బెంగాల్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
బీహార్లోని బెగుసరాయ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్.. ఓట్ల లెక్కింపుపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే తమ విజయం పట్ల పూర్తి ధీమా వ్యక్తం చేశారు. "బీహార్ను అర్థం చేసుకున్న వారికి తెలుసు. రాష్ట్ర ప్రజలు అరాచకాన్ని కోరుకోరని. ఇక్కడి ప్రజలు అవినీతిపరులైన నాయకులకు అధికారాన్ని అప్పగించాలనుకోవడం లేదు" అంటూ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీహార్ అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లదని ఆయన స్పష్టం చేశారు.
అలాగే బీహార్ విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన గిరిరాజ్ సింగ్.. తమ పార్టీ తదుపరి రాజకీయ లక్ష్యాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. "భాజపా కార్యకర్తగా చెబుతున్నా.. బీహార్లో ఎన్డీయే విజయం ఖాయం. ఇక తర్వాత లక్ష్యం పశ్చిమ బెంగాలే. అక్కడ జరిగే ఎన్నికల్లో కూడా మాదే గెలుపు. ప్రస్తుతం అక్కడ ఉన్నది అరాచక ప్రభుత్వం" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాలు చూస్తేనే.. బీహార్ ప్రజలు అన్యాయాన్ని వద్దనుకుంటున్నారని, ఎన్డీయే అభివృద్ధి అజెండాకు పట్టం కట్టాలనే ఓటర్లు నిర్ణయించుకున్నారని అర్థం అవుతోందని అన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ ఇస్తూ.. గిరిరాజ్ సింగ్ కూటమిలోని ముఖ్యమంత్రి అంశంపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే దానిపై ఎలాంటి గందరగోళం లేదు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నీతీశ్కుమారే.. కాబోయే సీఎం అంటూ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

