Indian Navy: భారత నేవీ రహస్య సమాచారం పాక్‌కు లీక్‌

Indian Navy: భారత నేవీ రహస్య సమాచారం పాక్‌కు లీక్‌
X
పాక్ ఏజెంట్లకు యుద్ధనౌకలు, స్థావరాల ఫోటోల పంపిణీ

భారత నౌకాదళానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్న ఒక నేవీ ఉద్యోగిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలపై లాన్స్ నాయక్ హోదాలో పనిచేస్తున్న ఆదర్శ్ కుమార్ అలియాస్ లక్కీని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

యూపీలోని ఆగ్రాకు చెందిన ఆదర్శ్ కుమార్ కేరళలోని కొచ్చిలో ఉన్న సదరన్ నేవల్ కమాండ్‌లో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అతడు పాకిస్థాన్‌కు చెందిన ఒక ఐఎస్‌ఐ ఏజెంట్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఎలక్ట్రానిక్, ఫిజికల్ సర్వైలెన్స్ ద్వారా ఇతడి కదలికలను గమనించిన ఏటీఎస్ పక్కా ఆధారాలతో లక్నోలో అరెస్ట్ చేసింది.

నిందితుడు ఆదర్శ్ కుమార్ తన విధుల్లో భాగంగా చూసే యుద్ధనౌకలు, వ్యూహాత్మక సైనిక స్థావరాలు, ఇతర సున్నితమైన రక్షణ కట్టడాల ఫోటోలను తీసి పాక్ ఏజెంట్లకు పంపినట్లు విచారణలో తేలింది. దీనికి ప్రతిగా పాక్ ఏజెంట్ల నుంచి ఇతడి బ్యాంక్ ఖాతాలోకి నగదు కూడా జమ అయినట్లు అధికారులు గుర్తించారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా గూఢచర్యానికి పాల్పడినందుకు అతడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కోర్టులో హాజరుపరిచిన అనంతరం నిందితుడిని న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆదర్శ్ కుమార్‌తో పాటు ఇంకా ఎవరైనా ఈ ముఠాలో ఉన్నారా? అతడు ఇంకా ఏయే కీలక సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేశాడు? అనే కోణంలో ఏటీఎస్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. గతంలో కూడా ఇటువంటి హనీట్రాప్ లేదా సోషల్ మీడియా ట్రాప్‌లో పడి కొందరు సైనికులు సమాచారాన్ని లీక్ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రక్షణ వర్గాలు అప్రమత్తమయ్యాయి.

Tags

Next Story