UP :జైలు భయంతో బల్లిని మింగేసాడు కానీ..

UP :జైలు భయంతో బల్లిని మింగేసాడు కానీ..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వింత ఘటన

ఉత్తరప్రదేశ్లో అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వింత చర్య కు పాల్పడ్డాడు. అరెస్టై పోలీసుల రిమాండ్​లో ఉన్న నిందితుడు తనను ఇక జైల్లో ఉంచుతారనే భయంతో ఏకంగా బల్లినే మింగేశాడు. ఈ విచిత్ర సంఘటన కాన్పూర్​ పరిధిలో జరిగింది. నిందితుడు బల్లిని మింగటాన్ని చూసిన పోలీసులు సిబ్బంది ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. వెంటనే అతడ్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

సాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికను మల్లవాని ఏరియాకు చెందిన మహేశ్​ అనే యువకుడు అత్యాచారం చేశాడని కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తీసుకువచ్చారు. అయితే మహేశ్​ను కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు తరలించాల్సి ఉంది. ఇంకా న్యాయపరమైన పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే మహేశ్​ భయంతో తన పక్కన కదులుతున్న బల్లిని మింగేసాడు. అవాక్కైన పోలీసులు ఆలస్యం చేయకుండా వెంటనే అతడిని భిటార్‌గావ్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉంది.


అసలు ఈ కేసులో చాలా ట్విస్టులు ఉన్నాయి. సధ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఉంటున్న బాధితురాలి తండ్రి, తన 18 ఏళ్ల కూతుర్ని ఒక మహిళ కిడ్నాప్ చేసిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు బెంగళూరులో ఉందని గుర్తించారు. అమ్మాయిని కాపాడారు. అయితే ఆమె తనను మహేష్ కుమార్‌ కిడ్నాప్ చేసి అత్యాచారం చేసాడని చెప్పడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఫతేపూర్ జిల్లాలోని కిషన్ పూర్‌ గ్రామానికి చెందిన వాడు.

అయితే నిందితుడు మహేశ్​, కేసు పెట్టిన యువతి చాలా కాలంగా కలిసి తిరిగేవారని, ఆ అమ్మాయి తన ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లి ఉండవచ్చని గ్రామస్థులు చెబుతున్నారు. విషయం బయటకు రావడం తో అమ్మాయి కావాలనే మహేశ్​పై కేసు పెట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story