Sonam: సోనమ్ స్టేట్మెంట్ను బయటపెట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు

రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ను పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం ఆమె ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ పోలీసులకు పట్టుబడింది. అనంతరం ఆమెను యూపీ పోలీసులు విచారించారు. తనకు మత్తుమందు ఇచ్చి లోయలోంచి పైకి తీసుకొచ్చారని.. అనంతరం ఘాజీపూర్లో విడిచిపెట్టినట్లుగా ఆమె చెప్పినట్లుగా యూపీ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ యష్ మీడియాతో పేర్కొన్నారు. సోనమ్ బాధితురాలిగా చెప్పుకుందని.. పోలీసులు తన దగ్గరకు వస్తారనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చిందన్నారు.
సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తాను ఘాజీపూర్-వారణాసి రోడ్డులోని ధాబాలో ఉన్నట్లుగా సోనమ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆమె కుటుంబం వెంటనే మధ్యప్రదేశ్ పోలీసులను సంప్రదించి.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ధాబాకు చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వన్ స్టాప్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం ఆమెను మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు.
ఇక సోనమ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా.. ఆమె చెప్పిందంతా కట్టుకథగా తేలింది. సీసీ కెమెరాల్లో ఆమె ఒక్కతే వస్తున్నట్లుగా కనిపించింది. కిడ్నాపర్లు విడిచిపెట్టిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో సోనమ్ కట్టుకథ అల్లిందని యూపీ పోలీసులు తేల్చారు. ఆమెకు పోలీసుల విధానాల గురించి సరైన అవగాహన లేదని.. బాధితురాలిగా నటిస్తూ తప్పించుకోవచ్చని భావించిందని.. కానీ అది విఫలమైందని అమితాబ్ యష్ తేల్చారు. ప్రస్తుతం ఈ కేసును మేఘాలయ పోలీసలు విచారిస్తున్నారని.. ఏదైనా సాయం కావాలంటే సహకరిస్తామని యూపీ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. రాజా రఘువంశీని చంపి.. అనంతరం ఎవరు వెళ్లలేని ప్రదేశంలో మృతదేహాన్ని పడేయాలని ఒక పక్కా ప్రణాళికతో కుట్ర పన్నారని.. కానీ ఆ ప్లాన్ అంతా అట్టర్ ప్లాప్ అయిందని అమితాబ్ యష్ చెప్పుకొచ్చారు.
అలాగే సోనమ్ ఇచ్చిన స్టేట్మెంట్ను మేఘాలయ పోలీసులు కూడా తోసిపుచ్చారు. కట్టుకథ అల్లుతున్నట్లుగా పేర్కొన్నారు. రాజ్ కుష్వాహాతో సోనమ్కు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తేల్చారు. ఒత్తిడికి లోనై జూన్ 9న పోలీసుల ఎదుట లొంగిపోయిందని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్కు మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అయితే తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో జంట విహరించారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకుని ప్రయాణించింది. అలా కొండ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే మే 23 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీశారు. మృతదేహాన్ని చూసి హత్యగా పరిగణించారు. అయితే సోనమ్ ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని కొండల్లో జల్లెడ పట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. దానిపై రక్తపుమరకలు కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. జూన్ 9న యూపీలో సోనమ్ ప్రత్యక్షం కావడంతో మర్డర్ మిస్టరీ వీడింది. ప్రస్తుతం సోనమ్ సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేఘాలయ పోలీసులు అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com