భక్తుల ఇళ్లకు నేరుగా మాతా వైష్ణోదేవి ఆల‌య ప్ర‌సాదం

భక్తుల ఇళ్లకు నేరుగా మాతా వైష్ణోదేవి ఆల‌య ప్ర‌సాదం
డీ టీ డీ సీ కొరియర్ తో ఆలయ బోర్డు ఒప్పందం

మ‌న దేశంలో ఎన్నో పురాత‌న‌మైన ఆల‌యాల్లో ఒకటి వైష్ణోదేవి ఆల‌యం. అమ్మవారి దర్శనం ఎంత ప్రాముఖ్యతను కలిగినదో ఆమె ప్రసాదం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే అమ్మవారి ప్రసాదం భక్తులకు శరవేగంగా చేరవేసేందుకు టీటీడీసీ కొరియర్ సర్వీస్ తో ఆలయ అధికారులు ఒప్పందం చేసుకున్నారు.

ముగ్గురమ్మల మూలపుటమ్మగా, దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా వస్తూనే ఉంటారు. మంచు కొండల మధ్య ఉండే ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని అభిప్రాయం.

మ‌హాభార‌తంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుని సూచ‌న మేర‌కు పాండ‌వులు వైష్ణో దేవిని పూజించార‌ట‌. అందుకే వారు ఆ యుద్ధంలో గెలిచార‌ని విశ్వాసం. అమ్మవారిని దర్శించుకున్న భక్తుల న్యాయమైన కోరికలు తప్పక తీరుతాయన్న నమ్మకంతో భక్తులు ఈ దేవిని దర్శించుకోవటానికి ఎంత శ్రమకైనా ఓర్చుకుంటారు. కొండ ప్రాంతంలో ఉండే వైష్ణో దేవి ఆల‌యానికి చేరుకోవాలంటే కాలి న‌డ‌క మార్గం, గుర్ర‌పు స్వారీ, ప‌ల్ల‌కి లేదా హెలికాప్ట‌ర్ స‌ర్వీస్‌లు ఉంటాయి. అమ్మవారి దర్శనం తో పాటుగా భక్తులు ప్రసాదం కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. అందుకే 2020 సెప్టెంబర్ లో వైష్ణవ మాత పూజా ప్రసాదం భక్తుల ఇళ్లకు చేరవేసే కార్యక్రమాన్ని జమ్ము కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ ప్రారంభించారు.

అయితే కొరియర్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తుండటంతో భక్తులు ప్రసాదం అందుకోవటంలో ఇబ్బందులు పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డిటిడిసి సహకారంతో ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. బోర్డు వెబ్సైట్ నుంచి లాగిన్ అయితే వంద రూపాయల నుంచి రూ. 2500 వరకు 5 క్యాటగిరిలలో ప్రసాదం ఆర్డర్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఆర్డ‌ర్ చేసిన 72 గంటల్లోగా కోరుకున్న వారి పేరిట పూజ చేసి, వారు ఎంచుకున్న ప్యాకేజ్‌ను బ‌ట్టి ప్ర‌సాదాన్ని డెలివ‌రీ చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story