Pm Modi Oath Ceremony: మోదీ ప్రమాణస్వీకారానికి విశిష్ఠ అతిథిగా.. వందేభారత్ లోకోపైలట్

నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం రాత్రి 7.13 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి మొత్తం 8000 మంది విశిష్ట అతిథులను ఆహ్వానించారు. వీరిలో పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, రోజుకూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే సిబ్బంది తదితరులు ఉన్నారు. దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ అసిస్టెంట్ లోకోపైలట్ ఐశ్వర్య ఎ మీనన్కు మోదీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందింది. అసిస్టెంట్ పైలట్గా ఇప్పటి వరకూ ఆమె 2 లక్షల గంటలకుపైగా వందేభారత్, జన శతాబ్ది సహా పలు రైళ్లను నడిపిన అనుభవం ఆమెకు ఉంది. చెన్నై-విజయవాడ, చెన్నై-కోయంబత్తూరు వందేభారత్ రైలును నడిపారు.
తన నిబద్దత, రైలు నడపడంలో నైపుణ్యానికి ఉన్నతాధికారుల నుంచి ఆమె ఎన్నో ప్రశంసలు, అవార్డులను అందుకున్నారు. ఐశ్వర్య మీనన్ సహ పలువురు రైల్వే ఉద్యోగులకు మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానాలు అందాయి. ఇక, ఆసియాలోనే మొదటి మహిళా లోకోపైలట్ సురేఖ యాదవ్కు కూడా మోదీ ప్రమాణస్వీకారానికి హాజరవుతున్నారు. ప్రస్తుతం యాదవ్ ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్-సోలాపూర్ మధ్య నడిచే వందేభారత్ రైలుకు డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 1988లో రైల్వేలో చేరిన సురేఖ.. దేశంలోనే మొట్టమొదటి మహిళా లోకోపైలట్గా రికార్డులకెక్కారు. అంతేకాదు, వందేభారత్ నడిపిన తొలి మహిళా డ్రైవర్ కూడా ఆమెనే.
వీరిద్దరితో పాటు మొత్తం 10 మంది లోకోపైలట్స్ని ప్రభుత్వం ఆహ్వానించింది. పారిశుద్ధ్య కార్మికులు, కూలీలతో పాటు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో పని చేసిన వారికి ఆహ్వానం అందింది. వేలాది మంది అతిథులకు తగ్గట్టుగా రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com