Vande Bharat Train: అతి త్వరలో పట్టాలపైకి వందే భారత్ స్లీపర్ రైళ్లు
రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే వందేభారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైళ్ల ప్రయోగాత్మక పరుగును ఆగస్టు 15 నాటికి నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు కూర్చొని ప్రయాణించేందుకు వీలుండే ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలు లభించనున్నాయి. ఇతర రైళ్లతో పోలిస్తే ఈ ప్రీమియం రైళ్లలో మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. వందేభారత్ ఎక్స్ప్రెస్ ఛైర్కార్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య తిరుగుతున్నాయి.
మరో 60 రోజుల్లోనే దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆగస్టు 15 వ తేదీ నుంచి పట్టాలపై వందే భారత్ స్లీపర్ రైళ్లు పరుగులు పెడతాయని చెప్పారు. ఈ క్రమంలోనే పట్టాలపై పరుగులు తీయడానికి వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధంగా ఉందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే ఈ వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం రెండు ప్రత్యేక ట్రాక్లను సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ రెండు ట్రాక్లపై ట్రయల్స్ పూర్తైన తర్వాత ప్రయాణికులకు వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులో వస్తాయని తెలిపారు.
అయితే ప్రయోగ దశలో ఈ వందే భారత్ రైలుకు నాలుగు స్లీపర్ క్లాస్ కోచ్లతో నడిపించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఆ తర్వాత స్లీపర్ కోచ్ల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. ఇక వచ్చే ఐదేళ్లలో సుమారు 400 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు.. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో వందే భారత్ రైళ్లు ఎక్కేందుకు ప్రయాణికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు వందేభారత్ ఏసీ చైర్కార్ రైళ్లు మాత్రమే అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను కూడా పరుగులు పెట్టించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com