Vande Mataram: నేటి నుంచి "వందేమాతరం” 150 వ వార్షికోత్సవాలు..

భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటైన “వందేమాతరం” జాతీయ గేయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు “వందేమాతరం” జాతీయ గేయం 150వ వార్షికోత్సవం ప్రారంభమవుతోంది. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా జరిగే ఈ సంస్మరణోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేడు 9.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా చరిత్రకు గుర్తుగా స్మారక తపాలా బిళ్ళ, స్మారక నాణెంను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు.
అలాగే ఉదయం 9.50 గంటలకు దేశంలోని అన్ని వర్గాల పౌరులు పలు బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా “వందేమాతరం” పూర్తి గేయాన్ని ఆలపించే కార్యక్రమం జరగనుంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ 2025 సంవత్సరాన్ని 150 ఏళ్ల “వందే మాతరం”గా పరిగణించింది. ఈ రోజు నుంచి వచ్చే ఏడాది 2026, నవంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా వందేమాతరం జాతీయ గేయం సంస్మరణోత్సవాలను జరపాలని నిర్ణయించారు.
వందేమాతరం గేయాన్ని 1875 లో సరిగ్గా నవంబర్ 7న అక్షయ్ నవమి పండుగ రోజున, ప్రముఖ బెంగాలీ కవి బంకించంద్ర ఛటర్జీ రచించారు. ఇది బంకించంద్ర రచించిన “ఆనంద్ మఠ్” నవలలో అంతర్భాగంగా ఉంది. ఇది తొలిసారిగా “బంగాదర్శన్” అనే సాహిత్య పత్రికలో ప్రచురించబడింది. భారత స్వాతంత్రోద్యమంలో ఈ గేయం కీలక పాత్ర పోషించింది. అత్యంత వేగంగా దేశ భక్తికి ప్రతీకగా మారి స్వాతంత్రోద్యమాన్ని ఉత్తేజపరిచింది. ఇక 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన సందర్భంగా ఈ “వందేమాతరం” గేయాన్ని “జాతీయ గేయంగా” గుర్తించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

