Vijay Kumar Sinha: బిహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి విజయ్ కుమార్ సిన్హా రాజీనామా..

Vijay Kumar Sinha: బిహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ సర్కార్ బలనిరూణకు సిద్ధమైంది. అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా. ఆర్జేడీ, జేడీయూ సర్కార్ ఏర్పడిన వెంటనే స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఐతే రాజీనామాకు ముందు అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు విజయ్ కుమార్ సిన్హా. అవిశ్వాస తీర్మానంలో భాగంగా చేసిన ఆరోపణలను ఆయన తప్పుపట్టారు.
ఇక తదుపరి స్పీకర్గా ఆర్జేడీ సీనియర్ లీడర్ అవద్ బిహారి చౌదరిని ఎన్నుకుంటారని తెలుస్తోంది. బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది ఎమ్మెల్యేలుండగా.. నితీష్ సర్కార్కు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఐతే ఫార్మాలిటీ కోసమే ఫ్లోర్ టెస్టు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో 241 మంది సభ్యులుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది.
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకుని.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల క్రితమే మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. మొత్తం 31 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో ఆర్జేడీకి 16 మంత్రి పదవులు దక్కగా.. జేడీయూ నుంచి 11 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరు కాంగ్రెస్, జీతన్ రాం మాంజీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com