VIJAY: దళపతి పట్టాభిషేకానికి కుదరని లెక్కలు

తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ గురువారం మరోసారి లోక్భవన్కు వెళ్లి, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి, అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ భేటీపై లోక్భవన్ తాజాగా ప్రెస్నోట్ విడుదల చేసింది. ‘‘ గవర్నర్ ఆర్లేకర్తో విజయ్ భేటీ అయ్యారు. మెజార్టీ కనిపించడం లేదని వివరించారు. మెజార్టీతోనే రావాలని గవర్నర్ సూచించారు’’ అని లోక్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరే ఇతర పార్టీని ఆహ్వానించబోమని విజయ్కు గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆహ్వానం మేరకే విజయ్ ఆయన్ను కలిసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు వీరి భేటీ జరిగింది.118 మంది సభ్యులు (మెజార్టీ మార్క్) సమకూరిన అనంతరం రావాలని సూచించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
లేఖ విడుదల చేసిన సీపీఐ
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి ము.వీరపాండియన్ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వనప్పటికీ, 108 స్థానాలు సాధించిన తమిళ వెట్రి కజగం పార్టీని అతిపెద్ద పార్టీగాఎన్నుకున్నారని సీపీఐ లేఖలో పేర్కొంది. టీవీకే అధినేత విజయ్ గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా, బాధ్యతలు చేపట్టకముందే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ నిబంధన విధించడం సరికాదని సీపీఐ అభిప్రాయపడింది.
అభిమానుల భావోద్వేగం
తమిళనాట టీవీకే అధినేత విజయ్ ప్రమాణస్వీకారం వాయిదా పడటంతో ఆయన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఈ కారణంతో విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ సమ్మతించలేదు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన విజయ్ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. ఈ విషయం తెలియక చెన్నై చేరుకున్న ఆయన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. దళపతి ఇంటి ముందు ఓ అభిమాని వెక్కి వెక్కి ఏడ్చాడు. విజయ్ సీఎం కావాలంటూ ప్రార్థన చేశాడు.
నేడు కీలక నిర్ణయం
టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ స్థానాలు రాకపోవడంతో విజయ్ వామపక్షాలు, వీసీకే మద్దతు కోరారు. అయితే.. ఈ విషయంలో వీసీకే, సీపీఐ, సీపీఎం నేతలు స్టాలిన్తో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. శుక్రవారం ఉదయం ఈ మూడు పార్టీల నేతలు మరోమారు సమావేశమై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. టీవీకేకు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించడం లేదని ఇప్పటికే విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. విశాల్, ప్రకాష్ రాజ్ వంటి సినీ నటులు బాహాటంగానే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటు, తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. నేటితో తమిళనాడు ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
