VIRAPPAN: దయనీయంగా వీరప్పన్ బాధిత కుటుంబాలు

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను పట్టుకోవటం కోసం వెళ్లి అమరులైన వారి కుటుంబసభ్యులు ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నారు. 1993 ఏప్రిల్ 9న తమిళనాడులోని మేట్టూరు సమీపం పాలారు అటవీ ప్రాంతానికి వీరప్పన్ను పట్టుకునేందుకు టాస్క్ఫోర్స్ బృందంతో పాటు ఎస్పీ గోపాలకృష్ణన్ బయలుదేరారు. ఈయన వెంట వీరప్పన్ గురించి సమాచారం ఇచ్చిన ఇన్ఫార్మర్లను, మేట్టూరు గ్రామాలకు చెందిన 16మందిని, తన సహాయకుడు మేట్టూరు క్లిమెన్స్ తదితరులను వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. వీరప్పన్ను నిర్బంధించేందుకు అన్ని అనుకూలంగా ఉన్నాయనుకున్న సమయంలో పాలారు సమీపం సురక్కాయ మడువు ప్రాంతంలో వీరప్పన్ పాతిపెట్టిన మందుపాతర పేలి.. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ తునాతునకలైంది. ఈ ప్రమాదంలో పోలీసు లు, అటవీశాఖకు చెందిన ఏడుగురు, గ్రామస్థులు 15 మంది దుర్మరణం చెందారు. ఆ వ్యాన్లో ప్రయాణించిన ఎస్పీ గోపాలకృష్ణన్, క్లిమెన్స్, గోవిందప్పాడి గ్రామానికి చెందిన ఇన్ఫార్మర్ ఇరుసార్ మాత్రమే తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
బాంబు పెట్టిన వీరప్పన్
మందుపాతర నుంచి తృటిలో తప్పించుకుని తీవ్ర గాయాలైన ఇరుసార్ మాట్లాడారు. టాస్క్ఫోర్స్ అధికారులకు భయపడి ఎప్పుడు పిలిచినా వీరప్పన్ కోసం దట్టమైన అటవీ ప్రాంతాలకు వెళ్తుండేవారమన్నారు. 1993లో టాస్క్ఫోర్స్ సిబ్బంది రాకను ముందే పసిగట్టిన వీరప్పన్ తాము ప్రయాణించే మార్గంలో మందుపాతరను అమర్చాడన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రూ.25 వేల నష్టపరిహారం సరిపోలేదన్నారు. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మేకలను మేపుతున్నట్టు తెలిపారు.
సాయం వైద్యానికి కూడా సరిపోలేదు..
క్లిమెన్స్ మాట్లాడుతూ తమకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇచ్చిన రూ.25వేలు వైద్యం తీసుకోవటానికి కూడా సరిపోలేదన్నారు. ప్రస్తుతం 75 ఏళ్ళ వయస్సులో కూలీ పనులకు వెళ్ళి కడుపు నింపుకోవాల్సిన దుస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తన కుమార్తెకైనా ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తే తమ కుటుంబాన్ని ఆదుకున్నవారు అవుతారన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వీరప్పన్ మందుపాతరకు బలైన 15 మంది కుటుంబీకులు, ఆ పేలుడులో బతికి బయటపడ్డ వారిద్దరిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.
బలవంతంగా తీసుకెళ్లారు..
కొంతమంది ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగా.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు లక్ష రూపాయిలను ప్రభుత్వం అందించి చేతులు దులుపుకుంది. మరోవైపు మరణించిన వారి భార్యలు పిన్న వయస్సులోనే వితంతువులయ్యారు. కూలి పనులు చేసుకుంటూ చాలీచాలని సంపాదనతో జీవితాన్ని ఈడ్చుకొస్తున్నట్టు తెలిపారు. వీరప్పన్ సమాచారం ఇచ్చినందుకు ఆ రోజున బలవంతంగా తమ వారిని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. మందుపాతర పేలుడులో మృతి చెందిన టాస్క్ఫోర్స్ సిబ్బందికి భారీగా నష్టపరిహారంచెల్లించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమ గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. కటిక దారిద్య్రం అనుభవిస్తున్న తమను ప్రభుత్వమే కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వీరప్పన్ అమర్చిన మందుపాతరకు బలై దయనీయ స్థితిలో ఉన్న 15 మంది కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com