Bengaluru: బెంగళూరులో నీటి సంక్షోభం

వేసవి సమీపిస్తుండటంతో నీటి ఎద్దడి లేకుండా బెంగళూరు అధికారులు చర్యలు చేప్టటారు. భూగర్భ జలాలు క్షీణిస్తుండటంతో బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB) తాగునీటి వాడకంపై కఠినమైన ఆంక్షలు విధించింది. గత వేసవిలో బెంగళూరు మహానగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాగేందుకు సరిపడా నీరు లేక సిలికాన్ వాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వేసవిని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక సర్కార్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. తాగునీటిని వృథా చేస్తే భారీ జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది.
డ్రింకింగ్ వాటర్ను కార్ వాష్, గార్డెనింగ్ సహా ఇతర అవసరాలకు వినియోగిస్తే రూ.5,000 వరకూ జరిమానా విధించనున్నట్లు సిటీ వాటర్ బోర్డు తెలిపింది. ‘వెహికల్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణం, ఫౌంటెయిన్స్, వినోద ప్రయోజనాల కోసం, సినిమా హాళ్లు, మాల్స్, రోడ్ల నిర్మాణం, క్లీనింగ్ వంటి కార్యక్రమాలకు తాగునీటిని ఉపయోగించడం నిషేధం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి వాటర్ బోర్డ్ చట్టంలోని సెక్షన్ 109 ప్రకారం రూ.5 వేల జరిమానా విధిస్తాం. పదేపదే అలానే చేస్తే మరో రూ.5 వేలు అదనంగా జరిమానా పడుతుంది’ అని సిటీ వాటర్ బోర్డు స్పష్టం చేసింది.
మరోవైపు సోమవారం బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇటీవలే వర్షపాతం లేకపోవడంతో భూగర్భ జలాలు ఎండిపోయినట్లు సిటీ వాటర్ బోర్డు తెలిపింది. రాబోయే రోజుల్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు నీటిని వృథా చేయకుండా అవసరమైన మేరకే వాడుకోవాలని సూచించింది.
కాగా, గత వేసవిలో బెంగళూరు మహానగరం తీవ్రమైన నీటి సంక్షభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నగరంలోని 14 వేల బోర్వెల్స్లో సగం వరకూ ఎండిపోయాయి. దీంతో నగరం రోజుకు 300 నుంచి 500 మిలియన్ లీటర్ల కొరతను ఎదుర్కొంది. ఇదే అదునుగా చూసుకుని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు దోపిడీకి పాల్పడ్డారు. ట్యాంకు నీటికి రూ.వేలల్లో ఛార్జ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com