Tamil Nadu : బీజేపీ తమిళనాడు కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్.

బీజేపీ తమిళనాడు కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ నియమితుడు కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇతర నేతలూ ఎవరూ ఆ పదవికి నామినేషన్ వేయట్లేదు. బీజేపీ తమిళనాడు కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ పేరును ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కె.అన్నామలై ప్రతిపాదించారు.
దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నైనార్ నాగేంద్రన్ నుంచి మాత్రమే నామినేషన్ దాఖలైందని చెప్పారు. అలాగే, ఇన్నాళ్లు ఆ పదవీకాలంలో పార్టీకి అన్నమలై చేసిన కృషిని అమిత్ షా ప్రశంసించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య మరోసారి పొత్తు కుదిరింది. ఇదే రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నైనార్ నాగేంద్రన్ నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.
ఎవరీ నైనార్ నాగేంద్రన్?
తిరునెల్వేలి నుంచి నాగేంద్రన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019, 2024 లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి రెండు సార్లూ ఓడిపోయారు. ఆయన అన్నాడీఎంకేతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2001, 2011లో తిరునెల్వేలి అసెంబ్లీ స్థానంలో గెలిచారు.
నాగేంద్రన్ 2001-2006 మధ్య మంత్రి పదవిలో కొనసాగారు. 2017లో అన్నాడీఎంకేకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలో క్రమంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజపీ అగ్ర నాయకులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల రామేశ్వరంలో జరిగిన పాంబన్ వంతెన కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు నాగేంద్రన్ వేదికపై కనిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com