Donald Trump: మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్

దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీని "అద్భుతమైన నాయకుడు"గా అభివర్ణించిన ట్రంప్, భారత్తో బలమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంతో గొప్ప ఒప్పందం కుదుర్చుకుంటానని ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా ట్రంప్ ప్రభుత్వం భారత్పై 50 శాతం సుంకాలు విధించడంతో ఇటీవల ఇరు దేశాల సంబంధాలు కొంతమేర సున్నితంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్ - అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది.
ముఖ్యంగా వ్యవసాయం, పాడి పరిశ్రమల రంగాల్లో అమెరికా మార్కెట్ యాక్సెస్ కోరుతోంది. కానీ, దీనివల్ల దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించినప్పటి నుంచి ఒప్పందానికి దగ్గరగానే ఉన్నామని చెబుతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
