Dowry harassment: కట్నం కింద కిడ్నీ- కాదన్నందుకు కోడలకు అత్తమామలు టార్చర్

Dowry harassment: కట్నం కింద కిడ్నీ- కాదన్నందుకు  కోడలకు అత్తమామలు టార్చర్
X
వరకట్న వేధింపుల్లో కొత్త రూపం..

దేశంలో వరకట్నమనే మహమ్మారి మహిళల జీవితాలను ఏ విధంగా ఛిద్రం చేస్తుందో చెప్పడానికి బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనం. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు తన కిడ్నీని ఇవ్వాలంటూ ఓ వివాహితపై అత్తింటివారు ఒత్తిడి తెచ్చారు. నిరాకరించడంతో దాడి చేసి ఇంటి నుంచి గెంటేశారు.

ముజఫర్‌పుర్‌ జిల్లాలోని మిఠన్‌పురా ప్రాంతానికి చెందిన దీప్తికి 2021లో బోచహాన్‌ ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. పెళ్లయిన కొత్తలో అంతా సవ్యంగానే ఉన్నా, కొన్ని రోజులకే అత్తామామల అసలు స్వరూపం బయటపడింది. పుట్టింటి నుంచి అదనంగా డబ్బు, ఒక బైకు తీసుకురావాలంటూ దీప్తిని వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు కొనసాగుతుండగానే, ఆమె భర్త కిడ్నీల్లో ఒకటి పూర్తిగా పాడైంది.

భర్త అనారోగ్యం అత్తింటివారి వేధింపులకు కొత్త మార్గాన్ని చూపింది. అదనపు కట్నం బదులుగా కనీసం ఒక కిడ్నీ అయినా తమ కుమారుడికి ఇవ్వాలంటూ దీప్తిపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో భర్త, అత్తామామలు కలిసి ఆమెను దారుణంగా కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దిక్కుతోచని స్థితిలో పుట్టింటికి చేరుకున్న దీప్తి, జరిగిన దారుణంపై స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ముజఫర్‌పుర్‌ రూరల్‌ ఎస్పీ విద్యాసాగర్‌ మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తామామలతో సహా మొత్తం నలుగురిని నిందితులుగా చేర్చామని తెలిపారు. వరకట్న వేధింపులు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

Tags

Next Story