Uttar Pradesh: భర్తను హత్య చేసి పొరుగువారిని ఇరికించిన మహిళ..

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ భార్య. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్లో నివాసం ఉంటున్న ధర్మేంద్ర అనే వ్యక్తి ఇటీవల తన ఇంట్లో హత్య చేయబడ్డాడు. అయితే తన భర్తలను పక్కింటి వారే హత్య చేశారని ధర్మేంద్ర భార్య రీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రాక్టర్ రిపేర్ విషయంలో తన భర్త ధర్మేంద్ర తో పక్కింటి వారు గొడవ పడ్డారని.. దీంతో వారే తన భర్తను హత్య చేసి ఉంటారని ధర్మేంద్ర భార్య రీనా ఆరోపించింది. బాధితుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కింటి వారిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే అరెస్టైన వారు మాకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం, హత్య గురించి ధర్మేంద్ర భార్య చెప్పిన కొన్ని విషయాలు పోలీసులలో అనుమానాన్ని లేవనెత్తాయి. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ధర్మేంద్ర హత్య ఇంటి బయట జరిగిందని రీనా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం ఇంటి లోపల రక్తపు మరకలను గుర్తించారు. డాగ్ స్క్వాడ్ కూడా ఇంటిబయట కాకుండా ఇంటి లోపలికి వెళ్లే ఆగిపోయింది. దీంతో రీనా మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. అయితే ఈ హత్య జరిగిన రోజు రీనా తన మేనల్లుడైన సతీష్తో 40 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలోనే రీనాకు, ఆమె మేనల్లుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు.. సతీష్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని మొత్తం సతీష్ పోలీసులకు వివరించాడు. రీనానే తన భర్తకు మత్తుమందు ఇచ్చి.. అతను నిద్రపోయిన తర్వాత తలను మంచం కోడుకు బాది హత్య చేసిందని తెలిపాడు. సతీష్ ఇచ్చిన వాంగ్మూలంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వీరిద్దరి వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలియడంతోనే అతన్ను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com