
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అరుదైన గౌరవం దక్కింది. 2023 ఏడాదికి ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు లభించింది.భారత్ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు దక్కగా వారిలో నిర్మలా సీతారామన్ తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్త జాబితాలో ఆమె 32వ స్థానంలో ఉన్నారు. గతేడాది 36వ స్థానంలో నిలిచారు. నిర్మలా సీతారామన్ తర్వాత భారత్ నుంచి HCL కార్పొరేషన్ ఛైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా 60వ స్థానంలోనూ, సెయిల్ ఛైర్పర్సన్ సోమా మోండల్ 70వ స్థానంలో నిలిచారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజూందర్ షా.. 76వ స్థానంలో ఉన్నారు. శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. ఆ ఏడాది ఆమెకు 34వ ర్యాంక్ దక్కింది. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం సాధించిన ఆమె 2022లో 36వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు 32వ స్థానంలో ఐదోసారి చోటు దక్కించుకోవడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన మహిళల జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ తొలి స్థానంలో నిలిచారు.రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com