
పోలీసుల వేధింపులు తాళలేక బాపట్ల జిల్లా కోళ్లపాలెంకు చెందిన మేరుగ కిరణ్ కుమార్ అనే దివ్యాంగుడు ఆత్మహత్యకు యత్నించాడు. పరారీలో ఉన్న తండ్రి కిశోర్ ఆచూకీ చెప్పాలని కొల్లూరు SI రాజ్యలక్ష్మి వేధించారని కిరణ్ ఆరోపించాడు. చంద్రబాబు బెయిలుపై విడుదలైన సమయంలో రామకృష్ణ, యశ్వంత్ అనే వ్యక్తుల మధ్య సామాజిక మాధ్యమాల్లో వాగ్వాదం జరిగిందని ఆ సమయంలో తన తండ్రి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారని కిరణ్ తెలిపాడు. తర్వాత యశ్వంత్ ఫిర్యాదుపై రామకృష్ణ, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి నుంచి తన తండ్రి ఇంటికి రావడంలేదని కిరణ్ వివరించాడు. తర్వాత తనను స్టేషన్ కు పిలిపించిన S.I రాజ్యలక్ష్మి కొట్టడమే కాకుండా కేసు పెడతానని బెదిరించినట్టు కిరణ్ వాపోయాడు. ఈ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి కిరణ్ ఆత్మహత్యకు యత్నించినట్లు తల్లి ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని తెలుగుదేశం నేత నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com