ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి స్పష్టం చేశారు. ఏపీకి ఆర్థికంగా కష్టకాలమే అని... అందుకే జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు ఆలస్యమవుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా ఎంతో ప్రగతి సాధించామని కూడా బుగ్గన వెల్లడించారు. అప్పుల విషయంలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ నాటి టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కన్నా తాము తక్కువ అప్పులే చేశామన్నారు. మూలధన వ్యయం ఎంతో పెంచామని గణాంకాలు వెల్లడించారు. ఆర్థికంగా అన్ని విషయాల్లో ఎంతో సాధించామని ప్రకటించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుందని చెబుతున్నారు. మరి ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా యనమల వ్యాఖ్యలపైనే తాను స్పందించినట్లు తెలిపారు. అలా చెప్పానంటే ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పినట్లు కాదు. ఏపీలో కష్టకాలమే ఉందని అందుకే జీతాలు, పెన్షన్లు ఆలస్యమవుతాయని ముందు నుంచి చెబుతూనే ఉన్నామన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com