
అసమానతలపై పోరాడే శక్తిమంతమైన ఆయుధం రాజ్యాంగమని, సమాజంలోని తారతమ్యాలకు వ్యతిరేకంగా నిలిచే సంస్థలను అది సృష్టిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. దేశ పౌరులకు వ్యవస్థాగత ప్రాథమ్యాలు, బాధ్యతలను నిర్దేశిస్తుందన్నారు. ఒ.పి.జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం, వ్యవస్థాపక దినోత్సవంలో బుధవారం ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని అన్ని కోణాల్లో జరిగే అన్యాయాలను గుర్తించాలని పిలుపునిచ్చారు. ‘‘నేటి మన సమాజానికి ముప్పు అస్తవ్యస్త గళాలే. విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన విషయాలకే పరిమితం కాకుండా, సహేతుక అంశాలకు గొంతుకగా నిలవాలి. సమాజంలో వాతావరణ మార్పులు, సమాచార లోపం, ప్రాథమిక వనరుల అసమాన పంపిణీ వంటి సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు కనిపించవు. అన్వేషణ, సహకారంలోనే వాటికి సమాధానాలు ఉన్నాయి’’ అని సీజేఐ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com