New Delhi: ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు... రాజధానిని కప్పేసిన పొగమంచు

ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాన్ని పొగమంచు కప్పేసింది. ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఉత్తర భారతం వణుకుతోంది. ఢిల్లీలో మంచు కురుస్తుండటంతో 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించడం లేదు. గాలి నాణ్యత కూడా 334గా నమోదైంది. వాతావరణ శాఖ ఢిల్లీలో ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
క్యాట్-3 (విజిబిలిటి సరిగా లేని పరిస్థితులలో సురక్షిత ల్యాండింగ్ కి సహకరించే సాంకేతికత) లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగవచ్చునని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రకటన చేసింది. ప్రయాణికులు విమానాల రాకపోకలకు సంబంధించి ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మంచుదుప్పటి కప్పుకుంది. జమ్మూ కశ్మీర్లో మంచు కురుస్తోంది. మంచు కారణంగా హిమాచల్ ప్రదేశ్లో పలు ప్రాంతాల్లో రోడ్లు మూసివేశారు.
ప్రస్తుతం ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్-4 అమలవుతున్నది. ఇందులో భాగంగా నిర్మాణ కార్యకలాపాలపై పూర్తిగా నిషేధం అమలులో ఉంటుంది. నగరంలో ట్రక్కులు ప్రవేశించకుండా నిషేధం ఉంటుంది. విమానాల రాకపోకలకు అంతరాయం.. నగరవ్యాప్తంగా భారీగా పొగమంచు నేపథ్యంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు తెలిపింది. విమానాలు ఆలస్యం కావడంతో పాటు రద్దయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. అప్డేట్స్ కోసం విమానాయాన సంస్థలను సంప్రదించాల్సిందిగా ప్రయాణికులకు సూచించింది. విమాన షెడ్యూల్ల కోసం విమానయాన సంస్థలతో తనిఖీ చేయాలని ప్రయాణికులను కోరారు. ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు.. విమాన స్టేటస్ని చూసుకోవాలని కోరింది. పొగమంచు కారణంగా రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. పొగమంచు కారణంగా ఢిల్లీకి వెళ్లే కనీసం 20 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ప్రభావిత రైళ్లలో గోవా ఎక్స్ప్రెస్, పూర్వా ఎక్స్ప్రెస్, కాళింది ఎక్స్ప్రెస్ మరియు రేవా-ఆనంద్ విహార్ టెర్మినల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com