
శ్రీవారి దర్శనార్థం కాలినడక మార్గంలో తిరుమల వచ్చే భక్తుల్లో గుండె సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో భక్తులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తితిదే శుక్రవారం ఓ ప్రకటనలో సూచించింది. ‘60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల, గుండె సంబంధిత వ్యాధులున్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం శ్రేయస్కరం కాదు. తిరుమల సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవాలి. కాలినడకన వచ్చే భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1,500 మెట్టు, గాలిగోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్యసహాయం పొందవచ్చు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24 గంటలూ వైద్యసాయం అందిస్తారు. కిడ్నీల సమస్య బాధితులు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం పొందవచ్చు’ అని తితిదే పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com