
తెలంగాణ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల ముందు ఇలా అనుమతి ఇవ్వడంపై రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఇలా చేయడం ఓటర్లను ప్రలోభానికి గురి చేయడం లాంటిదేనని ధ్వజమెత్తాయి. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అనడానికి ఇదే నిదర్శనమంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. యాసంగి సీజన్ కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి అనుమతించింది. ఈ నెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు అయిదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com