Social media: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..

Social media: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..

పదిహేను ఏండ్లలోపు పిల్లల సోషల్‌ మీడియా వాడకంపై ఫ్రాన్స్‌ త్వరలో నిషేధం విధించబోతున్నది. దేశవ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ తాజాగా వెల్లడించారు. మిడిల్‌ స్కూల్‌లో 14 ఏండ్ల ఓ విద్యార్థి స్కూల్‌ సిబ్బందిపై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడిన ఘటన ఫ్రాన్స్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే మాక్రాన్‌ నుంచి పై ప్రకటన వెలువడటం గమనార్హం. యువతలో హింసాత్మక ప్రవృత్తి పెంచడానికి సోషల్‌ మీడియా ఆజ్యం పోస్తున్నదని, పర్యవేక్షణ లేకుండా పిల్లల సోషల్‌ మీడియా వాడకం హానికరమని ఆయన అన్నారు.

ఫ్రాన్స్‌లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సంచలన ప్రతిపాదన చేశారు. యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే.. కొన్ని నెలల్లోనే ఫ్రాన్స్ స్వతంత్రంగా ఈ విధానాన్ని అమలు చేస్తుందని ప్రకటించారు. తూర్పు ఫ్రాన్స్‌లోని నోజెంట్ అనే ప్రాంతంలోని ఒక మధ్య పాఠశాలలో ఇటీవల జరిగిన విషాదకరమైన ఘటన తర్వాత మాక్రాన్ ఈ ప్రకటన చేశారు. అక్కడ 14 ఏళ్ల విద్యార్థి బ్యాగును సిబ్బంది తనిఖీ చేసే ప్రయత్నం చేసింది. ఇది ఏమాత్రం నచ్చని విద్యార్థి.. 31 ఏళ్ల పాఠశాల సిబ్బందిని కత్తితో పొడిచి చంపాడు.

అయితే కత్తితో దాడి చేసిన బాలుడు ఆన్‌లైన్ కంటెంట్ ద్వారానే ప్రభావితం అయి చేశాడా లేదా అనే అశంపై దర్యాప్తు అధికారులు నిర్ధారణకు రానప్పటికీ.. యువతలో దూడుకు స్వభావం పెరగడానికి సామాజిక మాధ్యమాలే కారణం అని మెక్రాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిరంతరం, నిఘా లేకుండా ఉపయోగించడం వల్ల హింసాత్మక ధోరణి పెరుగుతోందని అన్నారు. చిన్నారులు, టీనేజర్లపై సామాజిక మాధ్యమాల ప్రభావం గురించి పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనే మెక్రాన్ ఈ ప్రకటన చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా తన ఇంటర్వ్యూ తర్వాత మెక్రాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో కూడా టెక్ కంపెనీలు తమ బాధ్యతను మరింత పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story