
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. నాలుగు వారాల పాటు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు పిటీషన్ వేశారు. దీని పైన వాదనలు పూర్తయిన తరువాత కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. దీంతో, 52 రోజుల రిమాండ్ తరువాత చంద్రబాబు కు బెయిల్ లభించింది. పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరుచేస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు. నాలుగు వారాలు అంటే.. నవంబర్ 24 వరకూ మధ్యంతర బెయిల్ ను చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఈరోజు సాయంత్రం 5గంటల నుంచి 7గంటల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి నుంచి నేరుగా అమరావతికి చంద్రబాబు చేరుకుంటారని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com