
ముస్లిం పర్సనల్ లా ప్రకారం ముస్లిం అబ్బాయితో హిందూ అమ్మాయి వివాహం చెల్లుబాటు కాదని మధ్య ప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహాన్ని రిజిస్ట్రార్ వద్ద నమోదు చేయించుకునేందుకు పోలీసు భద్రత కల్పించాలని ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి కోర్టును ఆశ్రయించారు. పెండ్లి తర్వాత దంపతులిద్దరూ మతం మారబోరని యువతీయువకుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముస్లిం పర్సనల్ లాలో మతాంతర వివాహం నిషేధమే అయినప్పటికీ, ప్రత్యేక వివాహ చట్టం కింద చెల్లుబాటు అవుతుందని కోర్టుకు తెలిపారు. వీరి వాదనలను విన్న జస్టిస్ గుర్పాల్ సింగ్ అహ్లువాలియా.. హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని ప్రత్యేక వివాహ చట్టం కింద పెండ్లి చేసుకున్నప్పటికీ పర్సనల్ లా ప్రకారం నిషేధమైన ఈ వివాహం చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com