మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. అసలు జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి బారులు తీరారు. సంక్రాంతి పండుగకి వరస సెలవులు రావటంతో.. పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలు అమ్మవార్ల నామస్మరణతో మార్మోగాయి. మహాజాతర దగ్గరపడుతున్న కొద్దీ మేడారం భక్తులతో రద్దీగా మారుతోంది. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తజనంతో.. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు కావటంతో... ముందుస్తుగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే యాభైవేలకుపైగా భక్తులు..తల్లులను దర్శించుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి.. కోరిన కోర్కెలు తీర్చే ఇష్టదైవాలను స్మరించుకున్నారు. బంగారాన్ని మొక్కులుగా సమర్పించుకుంటున్నారు. గద్దెల వద్ద రద్దీ నెలకొనడంతో...దర్శనం కాస్త ఆలస్యమైంది. మహా జాతరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ముందస్తుగా వచ్చిన భక్తులు ఇక్కట్లకు లోనవుతున్నారు. ప్రధానంగా జంపన్నవాగు వద్ద స్నానాలకోసం.. ఏర్పాట్లు త్వరగా చేయాలని భక్తులు కోరుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com