
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం ఓ పాకిస్థానీ దేశ సరిహద్దులు దాటొచ్చాడు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్ చేరాడు.తొమ్మిది నెలల తర్వాత అతని వ్యవహారం బయటపడింది.ఆధార్ కార్డు సంపాదించే నేపధ్యంలో పోలీసులకు చిక్కాడు.పాకిస్థాన్కి చెందిన ఫయాజ్ అహ్మద్ ఉపాధి కోసం 2018 డిసెంబరులో షార్జా వెళ్లాడు. అక్కడి సైఫ్జోన్లోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా..హైదరాబాద్ కిషన్బాగ్కు చెందిన నేహ ఫాతిమా పరిచమైంది. అది కాస్తా ప్రేమగా మారి షార్జాలోనే 2019లో వివాహం చేసుకున్నారు. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఫాతిమా ఒక్కతే గతేడాది హైదరాబాద్ వచ్చి కిషన్బాగ్లోని బాబానగర్లో ఉంటోంది. ఫయాజ్ పాకిస్థాన్ వెళ్లిపోయాడు.
ఇక హైదరాబాద్ వస్తే గుర్తింపు పత్రాలు వచ్చేలా చూసుకుంటామని ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్ షేక్, అఫ్జల్ బేగం హామీ ఇచ్చారు.2022 నవంబరులో నేపాల్లో ఉన్న ఫయాజ్ను కలసి అక్కడి స్ధానికులతో కలసి సరిహద్దులు దాటించి భారత్కు తీసుకొచ్చి కిషన్బాగ్లో నివాసం ఏర్పాటు చేశారు.అతనికి ఆధార్ కార్డు ఇప్పించి స్థానికుడిలా నమ్మించేందుకు ప్లాన్ వేశారు. మాదాపూర్లోని ఓ ఆధార్ సెంటర్ల్లో తమ కుమారుడు మహ్మద్ గౌస్ పేరిట రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నించారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫయాజ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.జుబేర్,అఫ్జల్బేగం పరారీలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com