
ఖగోళ పరిశోధనల్లో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమైంది. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా-3 మిషన్ శాటిలైట్లను నింగిలోకి పంపనున్నది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం సాయంత్రం 4.06 గంటలకు పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నది.
ప్రోబా-3 మిషన్లో రెండు ఉపగ్రహాలు (కరోనాగ్రాఫ్ స్పేస్క్రాఫ్ట్, ఆక్యుల్టర్ స్పేస్క్రాఫ్ట్) ఉంటాయి. మొత్తం దాదాపు 550 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడం ప్రోబా-3 లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com