ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేడు ఛలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లోనే నిద్రించారు. ఇవాళ చలో సెక్రటేరియట్ ఉన్న నేపథ్యంలో షర్మిల ఉన్న భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలుచోట్ల కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులు చేశారు. దీనిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే నిర్బంధిస్తారా అని షర్మిల ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?అని నిలదీశారు. వేలాదిగా వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఈ పరిస్థితి రావడం జగన్కు అవమానం కాదా అని నిలదీశారు. తామేం తీవ్రవాదులం కాదని... సంఘ విద్రోహ శక్తులె కూడా కాదన్నారు. మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మీరు భయపడుతున్నట్లే. మీ అసమర్థతను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగదన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com