
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫర్నగర్ జాతీయ రహదారి -58పై మంగళవారం తెల్లవారుజామున కారు ట్రక్కు కింద పడిపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముజఫర్నగర్ జాతీయ రహదారిపై 22 చక్రాల ట్రక్కు కింద ఈ ఆరుగురు ప్రయాణిస్తున్న కారు పడింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
కారు ఢిల్లీ నుంచి హరిద్వార్కు వెళుతుండగా చాపర్ ప్రాంతంలోని రాంపూర్ క్రాసింగ్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టింది. దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో కారు ట్రక్కు కింద ఇరుక్కుపోయి కొన్ని మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. మృతులు ఢిల్లీలోని షహదారా నివాసితులని ముజఫర్నగర్ జిల్లా పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రి మార్చూరీకి తరలించారు. ఈ ఘోర ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు చెప్పారు. ప్రమాద సమాచారాన్ని మృతుల కుటుంబాలకు అందించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com