
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిపోతున్న మణిపుర్లో త్వరలో మంచిరోజులు వస్తాయని, దేశంలోని మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే అభివృద్ధి చెందుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తిరిగి శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు ప్రజలంతా కలిసి పని చేయాలని ఆయన కోరారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రతినిధుల బృందం శనివారం మణిపుర్ రాజధాని ఇంఫాల్లో పర్యటించింది. ఈ బృందంలో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ఉన్నారు. తమ పర్యటనలో భాగంగా అల్లర్లలో నిర్వాసితులైన వారిని శనివారం న్యాయమూర్తులు పరామర్శించారు. చురాచాంద్పుర్ జిల్లా లమ్కాలో ఉన్న మినీ సచివాలయం నుంచి పలు న్యాయ, వైద్య శిబిరాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. ‘‘భిన్నత్వంలో ఏకత్వానికి మన దేశం ప్రతీక. మీరు క్లిష్ట సమయంలో ఉన్నారన్న విషయం మాకు తెలుసు. రాజ్యాంగంపై నమ్మకం ఉంచండి. తప్పకుండా మణిపుర్లో శాంతి నెలకొంటుంది’’ అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com