Kejriwal: కేజ్రీవాల్‌కు నిరాశ

Kejriwal:  కేజ్రీవాల్‌కు నిరాశ

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర స్టే విధించింది. ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించి కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో గురువారం కేజ్రీవాల్‌కు ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శుక్రవారం ఆయన విడుదల కావాల్సి ఉంది. అయితే, ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై జస్టిస్‌ సుధీర్‌ కుమార్‌ జైన్‌ శుక్రవారం విచారించారు. ఈ విషయంలో పూర్తి రికార్డులను పరిశీలించాల్సి ఉన్నందున 2-3 రోజుల పాటు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించారు.

మరికొన్ని గంటల్లో తీహార్ జైలు నుంచి విడుదలవుతారన్న సమయంలో హైకోర్టు రూపంలో మరో షాక్ తగిలింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా విచారించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీంతో ఢిల్లీ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ పరిణామంతో ఆప్ షాక్‌కు గురైంది. ఇక తీర్పును రిజర్వ్ చేసే వరకు కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ తరపున హైకోర్టును కోరారు. కానీ కేజ్రీవాల్ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. మొత్తం రికార్డులను పరిశీలించాలని కోరుతున్నందున 2-3 రోజుల పాటు ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో తుది తీర్పు వచ్చే వరకు కేజ్రీవాల్‌ తీహార్‌ జైల్లోనే ఉండనున్నారు.

ఇదిలా ఉంటే ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్‌ చేసిన ఈడీ.. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని వాదించింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు.. 21 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు. మొత్తానికి ఇంత కాలానికి గురువారం ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే.. కొన్ని గంటల వ్యవధిలోనే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Next Story