
ఆంధ్రప్రదేశ్లో త్వరలో తలైవా రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా సీన్ త్వరలో కనిపించవచ్చని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలర్ చిత్రంలో రజినీకాంత్ పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్నతమైన స్థానంలో ఉన్న కుమారుడు దొంగతనాలు చేస్తున్న విషయం తెలిసి అతన్ని చంపాలని ఆదేశిస్తారని..ఏపీలోనూ అలాంటి ఘటన పునరావృతం కావచ్చన్నారు. ఇప్పటికే సీఎం జగన్ నిజ స్వరూపం తండ్రి లాంటి మోడీకి తెలిసి ఉండొచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు జగన్ తన పేరునో లేదా తన తండ్రి పేరునో పెట్టుకోవడం విచిత్రంగా ఉందన్నారు. పీఎం కిసాన్ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా అని ఏపీ ప్రభుత్వం నామకరణం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను జగన్ ప్రభుత్వం మారుస్తున్నట్లు తెలుసుకొని 5 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపేసిందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి ప్రచారం కల్పించే ప్రకటనల్లో ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో, మరో వైపు ముఖ్యమంత్రి ఫొటో వేసుకోవచ్చన్నారు. అలా కాకుండా జగన్ తన జేబులో నుంచి నిధులు ఖర్చు చేస్తున్నట్లు తన తండ్రి ఫొటో, తన ఫొటో ముద్రించుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దగ్గుబాటి పురందేశ్వరిపై తమ పార్టీ నాయకులు కూస్తున్న కారు కూతలు వింటే బాధనిపిస్తోందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com