AP: జగన్‌పైకి దూసుకొస్తున్న మరో బాణం!

AP: జగన్‌పైకి దూసుకొస్తున్న మరో బాణం!

వైఎస్‌ కుటుంబం నుంచి సీఎం జగన్‌కి వ్యతిరేకంగా మరో గళం వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్‌ చెల్లెలు, ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల... జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత సోమవారం ఇడుపులపాయలో భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను తొలిసారి కలవనున్నారు. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టి పోరాటమే చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం.. ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే.


ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు కూడా అయ్యారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కరరెడ్డితో పాటు ఇతరులు చంచల్‌గూడ జైలులో రిమాండు ఖైదీలుగా ఉండగా.. అవినాష్‌రెడ్డి బెయిల్‌ తెచ్చుకున్నారు. దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇది చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణను కోరడంతోనే సీఎం జగన్‌, సునీత మధ్య కుటుంబపరంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో రాజకీయంగా తాను వేయాల్సిన అడుగులపై సునీత షర్మిలతో చర్చించనున్నారు. తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు ఆమె అండగా నిలిచారు. సీబీఐకి తన వాంగ్మూలాన్ని సైతం ఇచ్చారు. ఇప్పుడు జరగనున్న భేటీలో సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Next Story