
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా నిలిపివేసిన యువగళం పాదయాత్రను వచ్చే వారం నుంచి ప్రారంభించే యోచనలో నారా లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే లోకేశ్ యువగళాన్ని ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో నారా లోకేశ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు ఆయన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో న్యాయవాదులతో నిత్యం సంప్రదిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. న్యాయపోరాటం కొనసాగిస్తూనే యువగళంతో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని నిర్ణియించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com