WTC 2021-23: డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు కోసం పోరు రసవత్తరంగా..

WTC 2021-23: డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు కోసం పోరు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఫైనల్ బెర్తులు ఇంకా ఖరారు కాలేదు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్లో బెర్తు ఖరారు చేసుకునేది. డ్రా కావడంతో దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇంకా ఉంది.
ఆసీస్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకోవాలంటే ఫిబ్రవరి- మార్చి మధ్య భారత్తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ వరకు వేచి ఉండాల్సిందే. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-1 లేదా 3-0 తేడాతో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుంది.
ఆసీస్తో నాలుగు టెస్టుల సిరీస్ స్వదేశంలో జరుగుతుండటం భారత్కు కలిసొచ్చే అంశం. ఒకవేళ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఘోరంగా ఓడిపోతే ఫైనల్ చేరే అవకాశాలు దెబ్బతింటాయి. ఈ సిరీస్ని టీమ్ఇండియా 2-1 తేడాతో కోల్పోయినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలున్నాయి. అయితే ఈ ఏడాది మార్చిలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల్లో న్యూజిలాండ్ ఒక మ్యాచ్ని డ్రా చేసుకోవాలి లేదా గెలవాల్సి ఉంటుంది.
దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల్లో వెస్టిండీస్ ఒక మ్యాచ్ గెలిచినా లేదా డ్రా చేసుకున్నా టీమ్ఇండియా ఫైనల్కు చేరుకుంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 75.56శాతం విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. 58.93 శాతంతో భారత్ రెండో ప్లేస్లో ఉంది. శ్రీలంక 53.93శాతం, సౌతాఫ్రికా 48.72శాతం విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ సమీకరణాల బట్టి చూస్తే ఆసీస్, భారత్ మధ్యే డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com